మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఇటీవలే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠికి నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ నాడు పెళ్లి తేదీని ప్రకటించలేదు. దాంతో, వరుణ్-లావణ్య ఎక్కడ? ఎప్పుడు? జరుగుతుందనేది మెగా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరగనుందని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం. షాపింగ్, ఇతర పనుల కోసం వరుణ్, లావణ్య ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడ్డారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ రాకతో సంతోషంలో ఉన్నారు మెగా ఫ్యామిలీ. ఈ వేడుకతో ఆ ఆనందం మరింత రెట్టింపు కానుంది.