ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జోరుగా బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే విశ్వ విఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిజ జీవిత కథను ఆయన తనయుడు బాలకృష్ణ వెండితెరకెక్కించటానికి అన్నీ ఫైనల్ చేసేసారు. దర్శకుడు తేజ రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ గా ప్రారంభం కానుంది. ఎన్టీయార్ పాత్రలో బాలయ్య నటించనున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథను కూడా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి.మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టిని వైఎస్ పాత్రకు, సీనియర్ నటి శరణ్యను విజయమ్మ పాత్రకు తీసుకున్నారని తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం తమిళ స్టార్ హీరో సూర్యను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జగన్ పాత్రలో సూర్య నటించడం దాదాపు ఖాయమని సమాచారం. వైయస్ జగన్ కు సూర్య మంచి స్నేహితుడు కావటంతో ఆయన ఓకే చేసారంటున్నారు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2019లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. మహి వి రాఘవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.