తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు తుని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లడుతూ.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని… ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని జగన్ ఆరోపించారు. మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు చూసిన చంద్రబాబు, దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్ అని పేర్కొన్న వైఎస్ జగన్, దివీస్కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. జగన్ పాదయాత్ర 2700 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం.
‘చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్. రైతన్నల నుంచి మాత్రం ఎకరాలకు ఎకరాలు లాగేసుకుంటున్నారు. దివీస్కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు పెడుతున్నారు. కంపెనీలు రావాల్సిన చోట రావాలి. విశాఖలో ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరం సంతోషించేవాళ్లం. కానీ అతిపెద్ద హాచరిస్ ఉన్న తుని నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇలాంటి కంపెనీలా. పైగా కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్గా ప్రకటించింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి నీళ్లను కలుషితం చేసి ఆక్వాజోన్కు ఆటంకాలు కలిగిస్తున్నారు చంద్రబాబు.
ఇదే తుని నియోజకవర్గంలో కాపుల రిజర్వేషన్లకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతిచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే 75 శాతం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించారు. కుట్రపూరితంగా రైలును తగలబెట్టించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఎస్సీలు, బీసీలు, ఆడపడచులు, చివరికి వికలాంగులపై కూడా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైలు దగ్దం ఘటనలో నమోదైన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
తుని ప్రభుత్వాసుపత్రిని పట్టించుకునే వారే లేరు. లెక్క ప్రకారం ఇక్కడ ఆస్పత్రుల్లో 11 మంది డాక్టర్లు ఉండాలి, కానీ నలుగురే ఉన్నారు. తునిలో 108 అంబులెన్స్ కూడా పనిచేయడం లేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తునిలో 11 వేళ ఇళ్లు కట్టించి ఇచ్చారు. తాండవ నుంచి మంచినీటి కోసం మహానేత హయాంలో రూ.26 కోట్లు ఇచ్చారు. వైఎస్సార్ నేడు మనమధ్య లేకపోవడంతో ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చి నాలుగన్నరేళ్లు గడిచినా లాభం లేదు. చెత్త వేయడానికి తునిలో డంపింగ్ యార్డ్ కూడా లేదని, శ్మశానాలలో చెత్త వేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తుని నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలుంటే.. రాష్ట్రం మొత్తం ఇంకా ఎన్ని సమస్యలున్నాయో అని అన్నారు.
‘ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబును ఇలాగే క్షమిస్తూ పోతే.. ఎన్నికలప్పుడు మరోసారి మీ వద్దకు వస్తాడు. ఎన్నికల హామీల్లో 90శాతంపైగా నెరవేర్చానంటాడు. అయితే మీరు చిన్న చిన్న మోసాలు, అబద్ధాలు నమ్మరని సీఎంకు తెలుసు. అందుకే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు చంద్రబాబు. అయినా నమ్మరని తెలిసి, ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామని చెబుతాడు. ఆపై మహిళా సాధికారమిత్ర అని కొందరు మీ ఇంటికొచ్చి రూ.3 వేలు ఇస్తారు. వద్దనకుండా రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచేసినది. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షిని నమ్మి ఓటేయాలంటూ’ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నవాళ్లు తనను నేరుగా కలుసుకోవచ్చునని, తాను బసచేసే చోటు అందరికీ తెలుసునన్నారు వైఎస్ జగన్.