‘నిన్ను కలిశాక’ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది పియా బాజ్పాయి. ఆ తర్వాత ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘దళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. నటి పియా బాజ్ పాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా కారణంగా తన సోదరుడు తనకు దూరమయ్యాడు. చావుబతుకుల మధ్య ఉన్న తన సోదరుడిని కాపాడుకోలేకపోయింది పియా. ‘ఫరూఖాబాద్ జిల్లాలోని కయంగంజ్ బ్లాక్లో నివసించే నా సోదరుడు కొవిడ్ కారణంగా కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి బెడ్, వెంటిలేటర్ అత్యవసరం. వాటి ఏర్పాటుకు దయచేసి ఎవరైనా సాయం చేయండి’ అని పియా ట్విటర్ వేదికగా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ‘నా సోదరుడు ఇకలేడు’ అంటూ మరో ట్వీట్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఎంతో ఉధృతంగా ఉంది. ఎంతోమందిని బలితీసుకుంటుంది. కొందరు దానితో పోరాడి బయటపడుతుంటే.. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు ఛిన్నాబిన్నమైపోతున్నాయి.