ఆన్లైన్ టికెట్ విధానానంపై ఏపీ ప్రభుత్వం, సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్నినాని ఇప్పుడు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ టికెట్ విధానంపై ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్ల వ్యవస్థను పరిశ్రమగా గుర్తించినందున పరిశ్రమలకు వర్తించే రాయితీలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ తరువాత రోజే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ఖాతాల్లో జమ అవుతుందని మంత్రి తెలిపారు. ఎగ్జిబిటర్లందరూ ప్రభుత్వ ఆన్లైన్ టికెట్ విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు నిర్మాత, ఎగ్జిబిటర్ అంబికా కృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. టికెట్ ధరలు పెంచాకే ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.