Homeతెలుగు Newsకేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతి

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతి

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఆయన అమెరికాలో చికిత్స పొందారు. న్యూయార్క్‌లోకి క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొంది గత నెల బెంగళూరు వచ్చారు. అనంతరం శ్రీశంకర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్‌ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

1 11

1959 జులై 22న బెంగళూరులో జన్మించిన అనంత్‌కుమార్ 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోడీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతకుమార్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతకుమార్‌ గొప్ప నేత అని.. ప్రజాసేవ చేయడానికి యుక్తవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌ తదితరులు అనంతకుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతకుమార్‌ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu