Chandrababu Helicopter Missing: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ అల్లూరి జిల్లా అరకులో సభకు వెళ్తుండగా ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిర్దేశిత మార్గం కాకుండా మరో మార్గంలోకి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. ఏటీసీ వర్గాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నందున టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ పేరుతో వివిధ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నం వరకు విమానంలో వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి అరకులో సభకు హెలీకాప్టర్లో బయలుదేరారు. విశాఖ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఆ ఛాపర్ మిస్సయింది. రాంగ్ రూట్లో వెళ్తోందని తెలిసిన ఏటీసీ తీవ్రంగా హెచ్చరించింది.
పైలట్ వర్సెస్ ఏటీసీ మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. వెనక్కి వచ్చేయాలని ఏటీసీ సూచించడంతో క్షేమంగా హెలికాప్టర్ విశాఖకు వచ్చేసింది. తర్వాత కాసేపటికి అరకు వెళ్లేందుకు సిగ్నల్ లభించడంతో తిరిగి బయలుదేరారు. అరకులో సురక్షితంగా ల్యాండ్ అయినట్టు అధికారులు వెల్లడించారు.
అనుకున్న సమయానికి చంద్రబాబు హెలీకాప్టర్ చేరుకోకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రూట్ మిస్సయిందని తెలియగానే కంగారు పడ్డారు. ఆ తరువాత క్షేమంగా విశాఖ చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.