కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి 9 తర్వాత దుకాణాలు, హోటళ్లు, బార్లు మూత పడనున్నాయి. బుధవారం నుంచి తెలంగాణలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘వకీల్సాబ్’ ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయించారు.
అత్యవసరమైతే తప్ప సినిమా చిత్రీకరణ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ప్రకటించారు.