సంక్రాంతికి సినిమాల విడుదలపై తెలుగు సినీ నిర్మాతల్లో వివాదం ముదిరింది. రజనీకాంత్ ‘పేట’ చిత్రానికి థియేటర్లు దొరకడంలేదంటూ ఆదివారం ‘పేట’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆ చిత్ర నిర్మాత అశోక్ వల్లభనేని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సినీ నిర్మాత దిల్రాజు సోమవారం స్పందించారు. సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని, అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని ఆయన ప్రశ్నించారు. మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. 18 నుంచి థియేటర్లలో ‘పేట’ మాత్రమే ఉంటుందని అశోక్ చెబుతున్నారని, మరి ఆ రోజే ‘పేట’ మూవీ విడుదల చేసుకోవచ్చు కదా? అని దిల్రాజు పేర్కొన్నారు. గతేడాది పంపిణీదారుడిగా తాను చాలా డబ్బులు పోగొట్టుకున్నానన్నారు. తెలుగు సినిమాల విడుదల తేదీ 6 నెలల ముందే ప్రకటించామని, అశోక్ వల్లభనేని అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని చెప్పారు.
సంక్రాంతికి తెలుగులో ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, ‘వినయ విధేయ రామ’, ‘f2’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ, రామ్చరణ్, వెంకటేశ్-వరుణ్తేజ్ నటించిన సినిమాలు కావడంతో థియేటర్లకు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో రజనీకాంత్ నటించిన పేట సినిమా కూడా విడుదల కానుంది.