విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు బయోపిక్కు తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ బయోపిక్ను తీయగలననే పూర్తి నమ్మకం లేక తప్పుకున్నట్లు చెప్పారు. బయోపిక్ తొలి భాగం “యన్.టి.ఆర్-కథానాయకుడు” సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తేజ తాజాగా మాట్లాడారు. బయోపిక్ గురించి స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించగా.. “నా తర్వాతి సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. నాకు ఎన్టీఆర్ బయోపిక్ చూసే సమయం లేదు. అందుకే నేను స్పందించలేకపోతున్నా. సినిమా చూసి వుంటే కచ్చితంగా మాట్లాడేవాడిని” అన్నారు. అనంతరం సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్నించగా.. “అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలి” అని తెలిపారు.
ఎన్టీఆర్ బయోపిక్ను రెండు భాగాలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగం “యన్.టి.ఆర్-కథానాయకుడు” జనవరి 9న విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఆశించినంతగా ఆదరించలేదు. యంగ్ ఎన్టీఆర్గా మాత్రం ఆయన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమాలో డ్రామా మిస్ అయిందనేది ప్రేక్షకుల అభిప్రాయం. రెండో భాగం యన్.టి.ఆర్-మహానాయకుడు” చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హరికృష్ణగా కల్యాణ్రామ్, శ్రీదేవిగా రకుల్ప్రీత్ సింగ్, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్రాజ్, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మీనన్ నటించారు.