
Modi Amaravathi Visit Cost:
మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమానికి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఈ మొత్తం వినగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఖర్చులో రోడ్ల మరమ్మతులు, ముఖ్యమైన మార్గాల్లో అలంకరణలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, పెద్ద స్థాయి బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు, మీడియా ప్రచారం, ప్రచార సామగ్రి కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం మాత్రం ఈ ఖర్చును సమర్ధించేందుకు ప్రయత్నిస్తోంది. “రాష్ట్ర రాజధాని గౌరవంగా కనిపించాలి కాబట్టి ఇంత ఖర్చు అవసరమే,” అంటోంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర అభివృద్ధిని చూపించేందుకు ఇది అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
అయితే ప్రజలలో, రాజకీయ వర్గాల్లో మాత్రం మరోరకంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అప్పులపై రాష్ట్రం నడుస్తోంది. అలాంటప్పుడు ఈ విధంగా భారీగా ఖర్చు చేయడం సరైందా? అనే ప్రశ్నలు మిగిలాయి.
కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ, “ప్రధాని పర్యటన ముఖ్యమే కానీ… అవసరమైన మోతాదులో ఖర్చు చేస్తే సరిపోతుంది. రూ.300 కోట్లు ఖర్చు చేయడం అనవసరం” అంటున్నారు. మరి ప్రజాధనాన్ని ఎంతవరకు ఉపయోగించాలి అన్నదానిపై చర్చ అవసరం.
ఇదిలా ఉండగా, అధికార యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తిచేస్తూ, మోదీ పర్యటనను గ్రాండ్ గా నిర్వహించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.