దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మరిన్ని సడలింపులతో జూన్ 30వరకు లాక్డౌన్ ను పొడిగిస్తున్నటు కేంద్రం ప్రకటించింది. జూన్ ఎనిమిది నుంచి ఆలయాలకు అనుమతి ఇచ్చింది. కాగా హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లను కూడా జూన్ 8 నుంచి ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విద్య సంస్థల పై జులై లో నిర్ణయాన్ని తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే విద్యాసంస్థలపై నిర్ణయం తీసుకోనున్నారు. కంటోన్మెంట్ జోన్ల్లో లాక్ డౌన్ పూర్తిగా అమలు చేయనున్నారు. సినిమా హాల్స్ కు, జిమ్ లకు, బార్లకు, పబ్ లకు, పార్కులకు ,ఆడిటోరియంలకు మాత్రం అనుమతి లభించలేదు.
రాష్ట్రాల మధ్య ప్రజలు, సరుకుల రాకపోకలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అయితే, రవాణా అనుమతించే విషయం ఇరు రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజలు ప్రయాణించాలంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సాయంత్రం 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మాత్రం వ్యక్తులు బయట తిరగటంపై యథావిధిగా నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.