సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. మే 9న ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో మహర్షి సినిమా విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో మహర్షి మేనియా నడుస్తోంది. విడుదలకు ముందే రూ. 120 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించగా.. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేశ్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూద్దాం..
కథ: హీరో(మహేష్ బాబు) రుషి కుమార్ ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని బిజినెస్ మేన్. తన కష్టాన్నీ, కలల్ని, విజయానికి సోపానాలుగా మలచుకున్న వ్యక్తి. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే తన జీవితం, తన విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు కాదని, వాటి వెనుక తన ఇద్దరి స్నేహితుల (పూజా హెగ్డే, అల్లరి నరేష్) కష్టం, త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రుషి ఏం చేశాడు? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవడమే అనుకునే రుషి – అసలు సిసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు? మహర్షిగా ఎలా మారాడు? అనేదే కథలో అంశం.

నటీనటులు: నటుడిగా మహేష్కి తనలోని వైవిధ్యాన్ని చూపించుకునే అవకాశం దక్కింది. తన పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కో వేరియేషన్లో ఒక్కోలా కనిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్గా కనిపించిన మహేష్ – విద్యార్థిగా మాస్ని అలరిస్తాడు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు తనలోని సిన్సియారిటీ కనిపిస్తుంది. మహేష్ తెరపై మరింత అందంగా కనిపించాడు. తన వరకూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేశాడు. కథానాయకుడిగా సరైన విజయం అందుకుని చాలా కాలమైన అల్లరి నరేష్కి ఇందులో వైవిధ్యభరితమైన పాత్ర దక్కింది. కథకి మూలస్తంభంగా నిలిచాడు. ‘గమ్యం’ లో గాలిశీను పాత్ర ఎంత బలమైనదో ఇది కూడా దాదాపు అంతే. ఇలాంటి పాత్రలకు ఇకపై నరేష్ పేరుని పరిశీలించడం ఖాయం. ఇక హీరోయిన్ గా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేయలేదు. కథానుసారం ఆ పాత్రకూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్ సన్నివేశాల్లో చిలిపిదనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్గా కనిపించింది. జగపతిబాబు మరోసారి స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కసారి వినగానే ఎక్కేయవు. కానీ, స్లో పాయిజన్లా వినగా వినగా నచ్చుతాయి. ‘మహర్షి’ విషయంలోనూ అదే జరిగింది. థియేటర్లో ఆ పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక నేపథ్య సంగీతంలోనూ దేవి తన మార్క్ను చూపించారు. దర్శక నిర్మాతలు సినిమాని స్టైలిష్గా, రిచ్గా తీర్చిదిద్దారు .. ప్రతి ఫ్రేం లోనూ ప్రేక్షకుడికి రిచ్నెస్ కనిపిస్తుంది. అందులో మహేష్ సినిమా కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతోంది.దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథ బలమైనదే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్లాంటి స్టార్ హీరోని ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది.
విశ్లేషణ: మహేష్ 25వ సినిమా ఇది . ఓ మైలు రాయి చిత్రానికి ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో అవన్నీ జోడించి అల్లుకున్న కథలా అనిపిస్తుంది. సీఈఓగా రుషిని పరిచయం చేసే సన్నివేశాలు చాలా స్టైలిష్గా ఉంటాయి. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ మొదలైపోతుంది. సీఈఓగా, విద్యార్థిగా అప్పటికప్పుడు తన పాత్రలోనే రెండు వేరియేషన్స్ చూపించాడు మహేష్. కాలేజీ సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమలాంటి ఎమోషన్స్ పండిస్తూనే విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. కాలేజీ నేపథ్యం, ముగ్గురి మధ్య స్నేహం, విద్యావ్యవస్థపై వ్యంగ్య బాణాలు విసురుతూ.. కొత్తదనం జోడించుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశాడు వంశీ పైడిపల్లి. ఇంటర్వెల్ కి ముందు సన్నివేశాలు మెలో డ్రామా ప్రధానంగా సాగాయి. ఎమోషన్స్ని పండించాయి.
సెకండ్ హాఫ్ లో కూడా అదే జోరు కనిపిస్తుంది. మొదటి లో విద్యావ్యవస్థని ప్రశ్నించిన రుషి – సెకండ్ హాఫ్ లో రైతు సమస్యలపై పోరాటం చేస్తాడు. దేశంలో రైతులు ఎదుర్కోంటున్న దీనస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించాడు. రుషి లక్ష్యం, ఆశయ సాధనకు ఎంచుకున్న మార్గం.. ఆలోచనలో పడేస్తాయి. ఓ కమర్షియల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్పడానికి ప్రయత్నించడం అభినందించదగిన విషయం. కాకపోతే.. కేవలం ఒకే అంశంతో సెకండ్ హాఫ్ మొత్తం నడిపించడం కాస్త సాగదీతగా కనిపిస్తుంది. ఇంచుమించుగా మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. సన్నివేశాల్ని కుదించుకునే వీలున్నా.. ఆ దిశగా చిత్రబృందం ఆలోచించలేదు. ఈ కథకు కీలకం అనుకున్న మహేష్ – నరేష్ ఎపిసోడ్లో ఎమోషన్స్ ఇంకాస్త బాగా పండాల్సింది. పతాక సన్నివేశాల వరకూ ఎలాంటి మలుపులూ లేకుండా సాగడం, క్లైమాక్స్ కూడా రొటీన్గానే ఉన్నా, ఓ కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం ప్రశంసించదగినదే.
టైటిల్ : మహర్షి
నటీనటులు: మహేశ్బాబు, అల్లరి నరేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేశ్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
నిర్మాత: దిల్ రాజు, సి. అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
హైలైట్స్
మహేశ్బాబు నటన
కాలేజీ సన్నివేశాలు
డ్రాబ్యాక్స్
అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు
చివరిగా : ఈ ‘మహర్షి’ తపస్సు ఫలించింది
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)












