కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయి. దీంతో రక్తదానం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఆయన రక్తదానం చేశారు. చిరు రక్తదానం చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనతోపాటు నటుడు శ్రీకాంత్ కూడా బ్లడ్ బ్యాంక్లో కనిపించారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు అడుగంటడంతో ఆసుపత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజలు విరివిగా రక్తదానం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ వేళ రక్త దాతల సంఖ్య గణనీయంగా తగ్గింది. రక్తం ఇచ్చేవారు లేక కొరత ఎక్కువగా ఉంది. రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా, క్యాన్సర్ ఉన్నవారు, బైపాస్ సర్జరీ రోగులు, ప్రమాదాలకు గురైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు ప్రజలు, అభిమానులు ముందుకు రావాలి. మీకు సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయండి. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినవారు అవుతారు. ఈ బాధ్యత మనందరిపైనా ఉంది. రక్తం దొరక్క చనిపోతున్నారనే పరిస్థితి రాకుండా చూడాలి. తమ్ముడు శ్రీకాంత్, మిత్రుడు శ్రీమిత్ర చౌదరి, వారి స్నేహితులు వచ్చి రక్తదానం ఇచ్చి స్ఫూర్తి నింపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు రక్తదానం చేయాలని కోరుతున్నా. లాక్డౌన్ ఉంది, రక్తదానం చేయొద్దని ఎవరూ ఆపరు. బయట పోలీసుల వల్ల ఏ ఇబ్బందీ తలెత్తదు. రక్తదానం చేస్తామని చెప్పగానే.. బ్లడ్ బ్యాంక్ నుంచి మీ ఫోన్ వాట్సాప్కు పాస్ వస్తుంది. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుంది’ అని తెలిపారు.
ఇటీవల హీరో నాని, ఆయన సతీమణి అంజనా కూడా రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్ట్కు రక్తదానం చేసి, ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రక్త దానం చేయడం ఎంతో అవసరమని నాని చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్న వేల మంది చిన్నారుల చికిత్సకు రక్తం కావాలని అన్నారు.