సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ సినిమా చేయనున్నారు. మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తు ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అతడు’ ఎంతపెద్ద హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి.
అలాగే ఈ సినిమా కోసం ప్రముఖ నటులను త్రివిక్రమ్ ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించనున్నారని సమాచారం. మహేశ్ బాబుకు మామయ్యగా మోహన్ బాబు నటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాత్రను తివిక్రమ్ చాలా వైవిధ్యంగా రూపొందించారని వినికిడి. ఇదిలా ఉంటే 1989లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన డైరెక్షన్లోనే తెరకెక్కిన సినిమా ‘కొడుకు దిద్దిన కాపురం’లో మోహన్ బాబు విలన్గా నటించారు.
ఈ సినిమాలో మహేశ్ బాబు బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్ బాబు, మహేశ్ బాబు కలిసి నటించనుండడం విశేషం. మరీ ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.