గత కొన్ని రోజులుగా గోదావరి నదికి వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో నదిలోకి బోటులను అనుమంతించడంలేదు. అయితే, గోదావరిలో ఉదృతి కాస్త తక్కువగా ఉండటంతో రాయల్ వశిష్ట అనే బోట్ 61 మందితో బయలుదేరింది. అందులో 50మంది ప్రయాణికులు ఉండగా, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఈ బోటు దేవీపట్నం మండలం కచులూరు మందం వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురయ్యే మునిగిపోయింది. కాగా, ఇందులో 24 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది. మిగతావారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
కాగా, ఈ బోట్ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. బోట్ ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ సర్కార్ రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.