Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య గట్టి వార్ జరుగుతుంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ రోజు పిఠాపురంలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ‘నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్లతో వస్తున్నారు’.
వారు సన్న బ్లేడ్లు తెచ్చి నన్ను, నా సెక్యూరిటీ సిబ్బందిని గాయపరుస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. మన ప్రత్యర్థి పార్టీ సంగతి తెలుసు కదా..? ఫొటోల కోసం మూకుమ్మడిగా అభిమానులు వచ్చినప్పుడు కొన్ని ప్రొటోకాల్ పద్ధతులు పాటిద్దాం.
అందరితో ఫొటోలు దిగాలని నాకూ ఉంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతాను. ప్రతిరోజు 200 మంది కలిసేందుకు అవకాశం ఇస్తాను. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు గతంలోనూ చేశారు. మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్లో జనసేనాని నోట వచ్చిన ఈ మాటలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు అనే భయంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు అని మండిపడ్డాడు. ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. కండువా కప్పి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు.