ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుతో సమావేశం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది మోహన్బాబు. మన మధ్య చాలా విషయాలపై మంచి చర్చ జరిగింది. సినిమా ప్రాముఖ్యత, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచవచ్చు అనే అంశాలపై చర్చించాం” అంటూ మోడీ తన ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో పాటు మోహన్బాబు కుటుంబంతో మోడీ కలిసిన ఫొటోను పోస్ట్ చేశారు. మోడీతో సమావేశం సందర్భంగా ‘వాట్ ఏ మ్యాన్!’ అని పేర్కొంటూ ఈ మధ్యాహ్నం మోహన్ బాబు చేసిన ట్వీట్ను దీనితో ప్రధాని జత చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీతో మోహన్ బాబు సమావేశం కావడంపై ఆయన బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. అప్పుడు మీడియా ప్రతినిధులు బీజేపీలోకి మోడీ మిమ్మల్ని ఆహ్వానించారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం చెప్పలేనంటూ మోహన్బాబు దాటవేయడం గమనార్హం. తిరుపతిలోని తమ విద్యాసంస్థలను సందర్శించాలని మోడీని కోరానన్నారు.