యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం. ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్న చిత్రం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న సినిమాను జులై 30, 2020న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అందుకు అనుగుణంగా షూటింగ్ను కూడా చేస్తున్నారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీపై దర్శకుడు రాజమౌళి కాస్త ఆసక్తికరంగా స్పందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తనయుడు శ్రీసింహా నటుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మత్తువదలరా’. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి యాంకర్ సుమతో పదే పదే ప్రస్తావించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి కాస్త ఆసక్తికరంగా స్పందించారు.
”2020కి విడుదలవుతుందా? అసలు వస్తుందా? అని నా సినిమాపై పడొద్దు. వీళ్లే (మత్తు వదలరా టీంను ఉద్దేశిస్తూ) సంవత్సరం పాటు తీస్తే, నేను తీయకూడదా” అంటూ జక్కన్న స్పందించగా, ‘పర్వాలేదండీ.. మీ చిత్రంలో మూడు ఆర్లు ఉన్నాయి. మూడేళ్లు తీయొచ్చు’ అంటూ సుమ చమత్కరించడంతో నవ్వులు పూశాయి. సినిమా విషయంలో అస్సలు రాజీపడని రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను అంతే శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ను పది భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పిన చిత్ర బృందం మొదట వెల్లడించిన తేదీకే విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమంలో రాజమౌళి అన్న మాటలు మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విశాఖలో ఎన్టీఆర్పై సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా ఆలియాభట్ నటిస్తోంది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్ అదరగొట్టేందుకు సిద్ధమవుతుండగా, ఆయన సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ జోడీగా నటిస్తోంది. ఇక అజయ్దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణలతో పాటు హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.