స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి బ్లాక్ ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు శంకర్-కమల్ కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ రాబోతోంది. అయితే ‘భారతీయుడు’ సినిమా తీయడం వెనకున్న కారణమేంటో శంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శంకర్ చదువుకుంటున్న రోజుల్లో కాలేజ్లో అడ్మిషన్ కోసం వెళితే అక్కడి యాజమాన్యం కుల, ఆదాయ సర్టిఫికేట్స్ కావాలని అడిగారట. ఈ సర్టిఫికేట్ల కోసం శంకర్ తల్లిదండ్రులు సంబంధిత అధికారుల వద్దకు వెళితే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ఘటనే తనను ‘భారతీయుడు’ సినిమాను తెరకెక్కించేలా చేసిందని శంకర్ వెల్లడించారు. ప్రస్తుతం సమాజంలో ప్రతీ సమాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యను ‘భారతీయుడు 2’లో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ‘భారతీయుడు 2’కు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్ను శంకర్ విడుదల చేశారు.
ఈరోజు నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో కమల్ హాసన్కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనున్నారు. లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సినిమా చిత్రీకరణను శంకర్ త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నారట.