టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాష్ను తొలగిస్తూ ఇవాళ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అలందా మీడియా డైరెక్టర్ ఎస్.సాంబశివరావు ప్రకటించారు. బోర్డు సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవిప్రకాష్ అడ్డుపడ్డారని, అందుకే తొలగించామని చెప్పారు. యాజమాన్య మార్పిడి జరగకుండా రవిప్రకాష్, సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని తెలిపారు. ఇకపై టీవీ9తో రవిప్రకాష్కు, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని, వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే తమ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చిచెప్పారు.
టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు సాంబశివరావు వెల్లడించారు. టీవీ9 ఛానల్లో కొత్త డైరెక్టర్లుగా కౌశిక్ రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్ నియమితులయ్యారు. ఏబీసీఎల్లో అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్నకు 90.5శాతం.. మిగతా 9.5 షేర్లు రవిప్రకాశ్, ఇతరులకు ఉన్నాయని డైరెక్టర్లలో ఒకరైన సాంబశివరావు వివరించారు. కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అంశంలో రవిప్రకాశ్ను తప్పించినట్లు ఆయన చెప్పారు. రవిప్రకాశ్ కేవలం షేర్హోల్డర్గా మాత్రమే ఉంటారు. షేర్ హోల్డర్గా రవిప్రకాశ్ సమావేశాలకు హాజరుకావొచ్చు’’అని సాంబశివరావు చెప్పారు.