విక్టరీ హీరో వెంకటేష్ గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ చిత్రంలో యంగ్ హీరో వరుణ్ తేజ్తో కలిసి నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో పాటు మరో చిత్రం క్రేజీ మల్టీస్టారర్కు కూడా ఓకే చెప్పారు వెంకటేష్.
మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ‘జైలవకుశ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీ ( కె.యస్. రవీంద్ర) దర్శకత్వం వహించనున్నారు. కాలా సినిమాతో రజనీకాంత్ ప్రేయసిగా నటించిన హుమా ఖురేషీ, వెంకీకి జోడీగా నటించనుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.