హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఆదివారం “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం విజయోత్సవ వేడుక జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, కల్యాణ్రామ్లు హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. ఆ ఇద్దరూ ఒకే వేదికపై కనపడితే చాలని ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరబోతుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్ను అటు అభిమానులు, ఇటు చిత్ర వర్గాలు మెచ్చుకున్నాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక.
బాలకృష్ణ, ఎన్టీఆర్లు ఒకే వేదికపై కనిపించనున్నారన్న సమాచారం తెలియగానే నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన “సింహా” సినిమాకు సంబంధించిన కార్యక్రమానికి ఎన్టీఆర్ విచ్చేసి సందడి చేశారు. ఇప్పుడు అబ్బాయి నటించిన “అరవింద సమేత” చిత్ర విజయోత్సవ సభలో బాబాయ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.