ఏపీ ప్రభుత్వం కొనుగోలుచేసిన కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ అదే కిట్ను 337 కే కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం రెట్టింపు ధరకు కొనడం దారుణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కరోనా కిట్లవిషయంలోనూ కమీషన్లకు పాల్పడటం హేయమని విమర్శించాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐసీఎంఆర్ అనుమతిచ్చిన సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. అయినా రూ. 65 తక్కువకే ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసిందని వివరించారు. ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్లోనే షరతు పెట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయని చెప్పారు. అదే సంస్థ నుంచి తయారీకి మనదేశంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చాక కిట్ల ధర తగ్గిందన్నారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే చెల్లింపులు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతుతో కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించిందని సీఎం తెలిపారు.