కొణిదెల ప్రొడక్షన్స్ అధినేతలైన హీరో చిరంజీవి, నిర్మాత రామ్చరణ్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోదుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వారసులమైన తమ నుండి తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పి అగ్రిమెంగట్ ఇచ్చారని..23 మంది కుటుంబ సభ్యులకు రూ.50 కోట్లు ఇస్తామన్నారని.. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఆ విషయం అడగటానికి చిరంజీవి ఇంటికి వెళితే తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. చిరంజీవి టైటిల్ పాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్చరణ్ నిర్మాత. ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
సినిమా మేకింగ్ సమయంలో తమకు డబ్బులు ఇస్తామన్న నిర్మాతలు.. తర్వాత పట్టించుకోలేదని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇటీవల చిరంజీవి ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. పోలీసులు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చిరంజీవి, చరణ్లపై కేసు పెట్టడంతో వివాదం మరోమారు తెరపైకి వచ్చింది.