ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జేమ్స్ బాండ్ 25’ వ సినిమా సెట్లో పేలుడు సంభవించింది. బ్రిటన్లోని ప్రఖ్యాత పైన్వుడ్ స్టూడియోస్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సెట్లో స్టంట్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా మూడు సార్లు పేలుడు సంభవించింది. దాంతో సెట్ పై కప్పు, గోడలు కూలిపోయాయి. ఈ ఘటనలో సెట్ బయట నిలబడిన ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి.
ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోందని చిత్రవర్గాలు అంటున్నాయి. తొలుత డేనియల్ స్టంట్ సీన్లు చేస్తున్నప్పుడు కిందపడిపోయారు. దాంతో ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పేలుడు ఘటన సంభవించడంతో చిత్రబృందం నిరాశకు గురైంది. ‘జేమ్స్ బాండ్’ సిరీస్లో రాబోతున్న 25వ చిత్రమిది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.