అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కొన్ని గంటల వ్యవధిలో మారిపోయి వైసీపీలో చేరారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. స్నేహితుడిగా ఉన్న ఆయన.. తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదని చెప్పారు. రవీంద్రబాబు అంటే ఇప్పటికీ తనకు గౌరవమేనన్నారు. అమరావతిలో జయదేవ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీలో గెలిచేవారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారని.. గెలవలేం అనుకున్నవాళ్లే పార్టీ మారుతున్నారన్నారు. రాజకీయాల్లో ఇది సహజమని చెప్పారు. జగన్తో సినీనటుడు నాగార్జున భేటీపై జయదేవ్ స్పందించారు. నాగార్జున తనకు మంచి స్నేహితుడని.. జగన్ను కలిసినంత మాత్రాన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదన్నారు. నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తే తనను సంప్రదిస్తారని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.