కేలండర్లో మే నెల అంటే ఎండలు మండే కాలమన్నమాట. ఈ సమయంలో ఎండలకు ప్రజలు అల్లాడుతూ బయటకు రావాలంటే భయపడుతుంటారు. కానీ రెండు నెలలుగా కరోనా భయంతో ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో హైదరాబాద్ రోడ్లపై జనాలు పరిమిత సంఖ్యలో కనిపిస్తున్నారు. ఎండలు మెండుగా ఉండే సమయంలో ఓ భారీ వాన హైదరాబాద్ను ముంచెత్తింది. రోడ్లన్నీ వాన నీటితో నిండిపోయాయి. భారీ ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. దీంతో తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.