టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మొక్కలు నాటిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ను నామినేట్ చేశారు. ఇది చాలెంజ్ కాదు.. భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అని మహేష్బాబు తెలిపారు. మహేష్బాబు ఛాలెంజ్ను స్వీకరించిన తమిళ స్టార్ విజయ్ తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుత కార్యక్రమం అని కొనియాడారు. తాను మొక్కలు నాటిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. మహేష్గారు నేను మొక్కలు నాటేది మీకోసం.. ఇక ఈ మొక్కలు ఆకుపచ్చని భారతావనితో పాటు మంచి ఆరోగ్యం కోసం. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని విజయ్ తన ట్వీట్లో తెలిపాడు.
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో మొక్కలు చాలా తక్కువని అన్నారు. అందువల్లే వాటిద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ఆయన పిలుపు మేరకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు మొక్కలు నాటడమే కాకుండా ఇతరులను నామినేట్ చేసి తమ బాధ్యతగా వారితోనూ మొక్కలు నాటేలా చేస్తున్నారు.