ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూ అని ప్రధాని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాతినుద్దేశించి నరేంద్రమోడీ ప్రసంగించారు.
”ప్రపంచ మానవాళి మొత్తం కరోనా సంక్షోభం ఎదుర్కొంటోంది. రెండు నెలలుగా ఇది కొనసాగుతోంది. ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగురుకతతో వ్యవహరించడం అవసరం మోడీ అన్నారు. అందరం చేయి చేయి కలిపి మహమ్మారిపై యుద్ధం చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మరి సృష్టిస్తున్న విలయాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మహమ్మరి నుంచి కాపాడేందుకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. ఇప్పుడే ఊరట లభించే కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ అందరి సమమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు మన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి దృఢ సంకల్పం. రెండోది కలిసి పోరాడడం” అని ప్రధాని అన్నారు.
‘కరోనా వంటి వైరస్ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదు. ప్రజలంతా బాధ్యతలు గుర్తెరిగి మసలు కోవాలి. అవసరం లేకుండా ఇంట్లోంచి బయటకు రావొద్దు. ప్రజలు పరస్పరం దూరం పాటించాలి. ఏకాంతంగా ఉండంతోనో ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చు. వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. వీలైనంత వరకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంట్లోంచే చేయాలి. వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్ల తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి తప్పనిసరి విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వద్దు” అని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
”కరోనా నివారణ కోసం జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా. ఈ ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్దు. జనతా కర్ఫ్యూ ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూ. అందరం సంయమనంతో దీన్ని పాటిద్దాం. సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు సేవలు అందిస్తున్న వైద్యులకు ఏదో ఒక రూపంలోవారికి ధన్యవాదాలు తెలపాలని అన్నారు. ఈ మహమ్మారి తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ సర్జరీలు వాయిదా వేసుకుందాం. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూద్దాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంచనా వేయడానికి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని ప్రధాని నరేంద్రమోడీ వివరించారు.