బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.. తన కుమార్తె జాన్వి కపూర్ దక్షిణాది సినిమాల్ని తిరస్కరించలేదని స్పష్టం చేశారు. జాన్వి ఫలానా దక్షిణాది సినిమాలో నటించబోతున్నారని ఇప్పటికే చాలాసార్లు వదంతులు వచ్చాయి. అయితే ఆమె నటించేందుకు అంగీకరించలేదని చివరికి రాసుకొచ్చేవారు. మహేష్బాబు, రామ్ చరణ్ సినిమాల విషయంలోనూ ఇలాగే ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ సినిమా కోసం జాన్విని కలిసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఆసక్తి చూపలేదని రాశారు.
ఈ నేపథ్యంలో బోనీ స్పందించారు. జాన్వి విషయంలో వచ్చినవి కేవలం వదంతులని తెలిపారు. ‘కపూర్ కుటుంబానికి దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టం. అక్కడ శ్రీదేవి చాలా సినిమాలు చేసింది. తెలుగు స్టార్స్ కృష్ణ గారు, చిరంజీవి గారితో మాకు గొప్ప బంధం ఉంది. మహేష్బాబు కూడా మాతో చాలా స్నేహంగా ఉంటారు. సరైన కథలు వస్తే నటించేందుకు జాన్వి సిద్ధంగా ఉంది. సరైన అవకాశం కోసం చూస్తున్నాం. కానీ ఇంకా ఏమీ ఖరారు కాలేదు. స్టార్ హీరోల సినిమాల్ని జాన్వి తిరస్కరించిందని వచ్చిన వార్తలు నిజం కాదు’ బోనీ అన్నారు.