HomeTelugu Newsటీడీపీని బతికించేది ఆ రెండే: జేసీ

టీడీపీని బతికించేది ఆ రెండే: జేసీ

7 20ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ మేరకు అమరావతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ అన్నారు.

మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.50 కోట్లు దాటిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని వివరించారు. ఇందుకోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జయప్రకాశ్‌ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కృషి చేస్తానని వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu