‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రకాశ్రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తనయుడు మంచు విష్ణుకు ఓటు వేయాలని మోహన్బాబు ‘మా’ సభ్యులను కోరారు. ఈ మేరకు వారికి వాయిస్ మెస్సేజ్ పంపారు.
‘‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’’ అని అన్నారు.