HomeTelugu Newsశాంతిభద్రతలపై జగన్‌ సమీక్ష

శాంతిభద్రతలపై జగన్‌ సమీక్ష

8 24ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వ్యాఖ్యానించారు.

‘ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలి. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని 6 మండలాల్లో, తూర్పు గోదావరి జిల్లాలోని రెండు మండలాల్లో గంజాయి సాగవుతోంది. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా అరికట్టే ప్రయత్నం చేయాలి. దీనిపై పోలీసు నిఘావిభాగం, గ్రేహౌండ్స్‌ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. గంజాయి సాగును నిరోధించేందుకు కొత్త తరహా ప్రణాళికలు తయారుచేయండి. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలి’ అని సీఎం సూచించారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. ఎన్నికల తర్వాత గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉందని, 12,198 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. విభజన హామీల మేరకు కొత్తగా ఆరు ప్రత్యేక పోలీసు బెటాలియన్లు, రెండు ఎన్డీఆర్ఎఫ్‌ బెటాలియన్లు రావాల్సి ఉందని తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేయడంపై ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పటిష్ఠం చేస్తామని, రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖలో అధికంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. శాంతిభద్రతల పరిక్షణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu