HomeTelugu Big Storiesఎస్పీ బాలుకి టాలీవుడ్‌ ఘన నివాళి.. ప్రముఖుల స్పందన

ఎస్పీ బాలుకి టాలీవుడ్‌ ఘన నివాళి.. ప్రముఖుల స్పందన

Tollywood tribute to sp bal
గానగంధర్వుడు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు(జూన్ 4). ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది. స్వరబ్రహ్మ డైమండ్ జూబ్లీ వేడుకలను ఈరోజు (శుక్రవారం) ఉదయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా నిర్వహించేందుకు టాలీవుడ్ సన్నద్ధమయింది. 12 గంటలపాటు ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమం ద్వారా సినీలోకం బాలు నామాన్ని స్మరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో హీరోహీరోయిన్లు దర్శక నిర్మాతలు సంగీత దర్శకులు గాయనీ గాయకులు గేయ రచయితలు మా అసోషియేషన్ అందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ బాలసుబ్రహ్మణ్యం తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. భారతీయ సినిమాకు ఎస్పీబీ చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, రాఘవేంద్రరావు, విశ్వనాధ్ లతో పాటుగా ఎన్. శంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు ఆయన గురించి మాట్లాడారు

కళాతపస్వి కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు అని అనిపించే లోటును క్రియేట్ చేసిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అది జన్మజన్మలకు ఒక రుణానుబంధంగా ఉండిపోతుంది.’’ అన్నారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ..‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. రక్తి గీతమైనా, భక్తి గీతమైనా ఏది పాడాలన్నా బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు. ఇప్పటికీ అతని మాటలు నాకు వినిపిస్తుంటాయి. భక్తి పాటలు పెట్టినప్పుడల్లా అతని గొంతు వినిపిస్తుంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతని సంగీతం వింటూనే ఉంటాము.’’ అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ”బాల సుబ్రహ్మణ్యం గారికి నాకు 50 సంవత్సరాల అనుబంధం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి సారి ‘నేనంటే నేనే’ సినిమాలో అన్ని పాటలు పాడారు. 16 భాషల్లో నాలుగు వేల పాటలు పాడి వరల్డ్ రికార్డ్ సృష్టించిన కళాకారుడాయన. అలాంటి వ్యక్తి మన తెలుగువాడు అవటం మన అందరి అదృష్టం” అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ”ఈరోజు నేను మిశ్రమ అనుభూతికి లోనవుతున్నాను. ఒకవైపు ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ఆనందగా ఉంది. మరోవైపు బాలును తలచుకుని మనసు బరువెక్కిపోయి ఉంది. బాలు అన్నయ్య 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. అన్నయ్యతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబ పరంగా, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నేను బాలుగారు అంటే ఆయనకు నచ్చదు. అన్నయ్య అని పిలవమనేవారు. వ్యక్తిగతం బాలు అన్నయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్లంతా నన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు. అన్నయ్య కోసం వసంత స్వయంగా రాసి పాడిన పాట ఎంతో బాగుంది. ఆ పాటను ఆమె అనుమతితో ఈ రోజు విడుదల చేస్తున్నాం. ఈ రోజు హనుమాన్ చాలీసా పాట వింటున్నప్పుడు ఆయన పాడిందేనని గుర్తొచ్చింది. ఆ రకంగా సంగీతం ఉన్నంత వరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు. ఆయన ఎక్కడున్న శాంతంగా ఉండాలి. ఆయన అజరామరుడు.’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు.

కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకునిగానే కాకుండా నటునిగా సంగీత దర్శకునిగా గాత్రదాతగా కూడా మెప్పించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులూ రివార్డులూ సాధించారు బాలు. 23 నంది అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించిన ఎస్పీబీ.. ఉత్తమ గాయకునిగా ఆరుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu