టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ఈ నెల 12న విడుదల కాబోతుండగా, చిరంజీవి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు తమిళ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేసేందుకు దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. అయితే, టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు విడుదలవుతున్న క్రమంలో విజయ్ సినిమాను విడుదల చేస్తుండటంపై టాలీవుడ్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. చిరు, బాలయ్య అభిమానులు సైతం దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ సినిమాను విడుదల చేస్తే చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు తక్కువవుతాయనే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ‘వారసుడు’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న కాకుండా 14వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తమిళ్ వర్షన్ మాత్రం యథావిధిగా 11న విడుదల అవుతుందని చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నానని, తానే ఒక అడుగు వెనక్కి వేశానని చెప్పారు. అందరూ తనపై పడి ఏడుస్తున్నారని… పండ్లున్న చెట్టుకే ఎక్కువ రాళ్ల దెబ్బలు పడతాయని వ్యాఖ్యానించారు. తనను ఎవరూ కార్నర్ చేయలేరని అన్నారు.