క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. తొలి సినిమా టైటిల్ను బుధవారం ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ విషయాన్ని విజయ్ వినూత్నంగా వెల్లడించారు. ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘తరుణ్ ఎక్కడున్నావ్ రా.. ఇప్పుడే ఓ స్క్రిప్టు విన్నా, మస్తుగా ఉంది. నచ్చింది, బాగా నవ్వుకున్నా. ఆ డైరెక్టర్, టీంను చూస్తే ‘పెళ్లి చూపులు’ సమయంలో మనమే గుర్తొచ్చాం’ అని విజయ్ ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్కు ఫోన్లో చెబుతూ కనిపించారు. అంతేకాదు తరుణ్నే హీరోగా అనుకుంటున్నట్లు కూడా చెప్పారు.
‘చిత్ర పరిశ్రమలోకి రావడానికి, ఓ సినిమా తీయడానికి మేం ఎన్నో ఇబ్బందులు పడ్డరోజే.. సక్సెస్ అయ్యాక నిర్మాణ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నా. ఇది ఎంత కష్టమో అర్థమైంది. కానీ సవాళ్లులేని జీవితానికి అర్థం లేదు. అందుకే ‘కింగ్ ఆఫ్ ది హిల్’ స్థాపించి, మొదటి సినిమా టైటిల్ ప్రకటిస్తున్నా’ అని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.