సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు మహేష్ ఆదివారం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సినిమా సెట్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వెళ్లారు. ఆయన మహేష్ ను కలిసి, కాసేపు మాట్లాడారు. మూవీ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ఆదివారం నరేష్ తన ఫేస్బుక్ ఖాతాలో డెహ్రాడూన్ విమానాశ్రయం ఫొటోను షేర్ చేశారు. దీన్ని బట్టి ఆయన కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు.