కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ లక్ష కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్ను అందించనున్నట్లు తెలిపారు. అమితాబ్ చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్, కల్యాణ్ జ్యువెలరీ సంస్థలు మద్దతు ఇవ్వనున్నాయి.
‘ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనకి మనమే చేతనైనంత సాయం చేసుకోవాలి. అమితాబ్ చేపట్టిన ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మేము కూడా భాగం కావడం మాకెంతో సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు కావాల్సిన నెలవారీ రేషన్ను అందించనున్నాం.’ అని సోనీ పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు.