నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ పొష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ముందు చూపుతో ఆలోచించేవారని, ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే ఎన్టీఆర్ చేసిన అభివృద్ది కార్యక్రమాలేనని అన్నారు. అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ వచ్చిందని, అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలని అన్నారు. సినిమా షూటింగులు ప్రారంభించే అంశంపై సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని బాలకృష్ణ అన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . షూటింగ్ సమయంలో సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు.