జీఎస్టీ, ఆదాయపన్ను వసూళ్లపై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఈయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు. హైదరాబాద్లో జరిగిన ప్రజ్ఞా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఎకనామిక్ సూపర్ పవర్ 2030 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పన్ను సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని 21 వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి పనిగా అభివర్ణించారు. ఏడాదికి 10 శాతం వృద్ధి సాధిస్తే 2030 నాటికి భారత్ సూపర్ పవర్గా అవతరిస్తుందన్నారు.
దేశంలో బ్రిటిషర్ 71 ట్రిలియన్స్ లూటీ చేశారని, అప్పటి ప్రధాని నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. పీవీ నరసింహారావు సంస్కరణలకు ఆద్యుడిగా అభివర్ణించారు. పీవీ హయాంలోనే 1 శాతం ఉన్న జీడీపీని 8 శాతానికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆదాయపు పన్ను మరియు 21వ శతాబ్దంలో అతిపెద్ద పిచ్చి పని జీఎస్టీ అని, దాంతో పెట్టుబడిదారులను భయపెట్టొద్దని సూచించారు. జీఎస్టీ చాలా క్లిష్టంగా ఉందన్నారు. అవినీతిని తొలగించి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఆదాయపు పన్నును రద్దు చేస్తే అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.