కేరళలోని ఓ జువెలరీ షాపులో పనిచేసే సేల్స్ మెన్లు ఆరుగురు రాత్రికి రాత్రి కోటీశ్వరులవడం సంచలనంగా మారింది. కేరళకు చెందిన రొణ్ణి, వివేక్, రాజీవ్, సుబిన్ థామస్, రిమ్జిన్, రతీష్ అనే వ్యక్తులు కొల్లం జిల్లాలోని ఓ బంగారం షాపులో సేల్స్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరందరూ తలాకొంత వేసుకుని రూ.300తో ఓ ఏజెంట్ వద్ద బుధవారం రాత్రి కేరళ ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొన్నారు. అది కూడా బుధవారమే కొనుగోలు చేసి ఆ మరుసటి రోజునే కోటీశ్వరులయ్యారు. గురువారం వెలువడ్డ లాటరీ ఫలితాల్లో ఈ ఆరుగురు వ్యక్తులు కొన్న టికెట్కే జాక్పాట్ తగిలి రూ.12 కోట్లు గెలుచుకున్నారు.
దీంతో వీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. వీరు కొనుగోలు చేసిన టిక్కెట్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతి రూ.12 కోట్లు కాగా, పన్నులు, ఇతరత్రా మినహాయింపులు పోగా, రూ.7.5 కోట్లు చేతికి రానుంది. అలా అయినా తలో కోటి రూపాయలు దక్కనుంది. వారిలో అత్యధికులు తమ అప్పులు తీర్చేందుకు ఆ నగదు వినియోగిస్తామని చెబుతున్నారు. గెలిచిన మొత్తంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని అన్నారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న వారిలో ముగ్గురు కలిసి తొలుత టికెట్ కొన్నారు. కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడతాయనగా మరో ముగ్గురు అందులో భాగస్వాములుగా చేరడంతో అదృష్టవంతులు కావడం గమనార్హం. ఇదే లాటరీలో మరో 10 మంది రూ.50 లక్షలు, ఇంకో 20 మంది రూ.10 లక్షలు చొప్పున బహుమతి గెలుచుకున్నట్లు లాటరీ యాజమాన్యం ప్రకటించింది.