HomeTelugu Trendingబాలయ్యను కలిసా.. త్వరలో మెగాస్టార్‌ని కలుస్తా:మంచు విష్ణు

బాలయ్యను కలిసా.. త్వరలో మెగాస్టార్‌ని కలుస్తా:మంచు విష్ణు

Manchu vishnu 1
సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతానని హీరో, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను తొలిసారి కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు.

భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఆనందంగా ఉంది. అన్నయ్య ఎన్‌.టీ.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేశా. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి.. గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు’అని తెలిపారు.

విష్ణు మాట్లాడుతూ.. తాను త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు. ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశాను. త్వరలోనే చిరంజీవిని కలుస్తాను. ఈ ఎన్నికల్లో బాలయ్య నాకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆశీర్వాదం తీసుకోవడానికే ఈరోజు ఆయన ఇంటికి వచ్చాను. పెద్దలందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తాను’ అని వివరించారు. ఎన్నికల అనంతరం ‘మా’లో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా బాలయ్యతో భేటీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu