HomeTelugu Trendingవారు నా దృష్టిలో దేవుళ్లు: శేఖర్ కమ్ముల

వారు నా దృష్టిలో దేవుళ్లు: శేఖర్ కమ్ముల

7 26
కరోనా మహామ్మరి విజృంభిస్తున్న నేపద్యంలోనూ ప్రజాశ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేయడానికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ముందుకొచ్చారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ.. ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎమ్‌సీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎమ్‌సీనే నిర్వహించబోతోంది.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం. వారి ఆరోగ్యం గురించి ఆలోచించి దర్శకుడు శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ఈ రోజు కరోనా నివారణకు స్వీయ నియంత్రణ తప్ప మరో మందు లేదు. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు
చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. కానీ కొంతమందిలో ఇంకా మార్పు రావాలి. బయటకు అనవసరంగా వచ్చి వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు. అలాంటి వారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. కార్మికుల గురించి ఆలోచించిన శేఖర్ కమ్ములకు నా ధన్యవాదాలు’ అన్నారు.

అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘నేను మా ప్రాంతంలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికుల్ని చూస్తున్నా. మన కోసం ఎండలోనూ కష్టపడుతున్న వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఆలోచనతో అమిగోస్ సంస్థ నుంచి వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందివ్వాలని నిర్ణయించుకున్నా. వాటిని మేం పంచడం కంటే.. సిబ్బంది ద్వారానే అందించగలిగితే కార్మికులకు గౌరవం ఇచ్చిన వారమవుతాం. అందుకే పంపిణీని జీహెచ్ఎమ్‌సీకే అప్పగించా. ఈ కార్యక్రమంతో మరికొంత మంది వారికి సహాయంగా నిలుస్తారని ఆశిస్తున్నా. పారిశుద్ధ్య కార్మికులంటే.. నా దృష్టిలో దేవుళ్లతో సమానం. ఇది మనిషికి, మనిషి తోడుండాల్సిన సమయం.ఇది తప్ప వేరే దారిలేదు” శేఖర్‌ కమ్ముల అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu