HomeTelugu Newsముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష : కేసీఆర్‌

ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష : కేసీఆర్‌

13 10

సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో కేసీఆర్‌ మాట్లాడారు. మార్చి1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను రానున్న రెండు మూడు రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు లేవని.. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం తొలి నుంచీ కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు పాటించడంతో అక్కడ ఎలాంటి కేసులూ నమోదు కాలేదని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు.

ఇంతకుముందు థియేటర్లు, మాల్స్‌ మూసివేతను వారం రోజులుగా నిర్ణయించినా.. దాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించవద్దని ఆదేశాలిచ్చామన్నారు. వీలైనంత వరకు విదేశాల నుంచి వచ్చిన వారే స్వయంగా ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని అందించాలని కోరారు. స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివెళ్లాలని కేసీఆర్‌ సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను రద్దు చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తామని.. ప్రజలు ఇళ్ల నుంచే వీక్షించవచ్చని సీఎం వివరించారు.

‘ప్రజా రవాణాకు సంబంధించి బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర వాహనాల్లో హై శానిటేషన్‌ చేపట్టాలని ఆదేశించాం. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు సూచించాం.. రేపటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలిసిన తర్వాత జిల్లా స్థాయిలో వేసిన కమిటీలు హోం క్వారంటైన్‌ చేస్తాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వో కమిటీలో ఉంటారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1165 మందిని వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంచాం. కొంతమంది ఇళ్లకే వెళ్తాం అంటున్నారు. అలాంటి వారిని ఇళ్లకు పంపించినా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారిపై నియంత్రణ ఉంచాలని నిర్ణయించాం. రైళ్లలో చేపట్టాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడాం. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, ఏపీ రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దుగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల సరిహద్దుల వద్ద 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి తెలంగాణలోకి అనుమతిస్తాం’ అని చెప్పారు.

మన రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. రాష్ట్రంలో ఉన్నవారిలో ఎవరికీ సోకలేదు. విద్యార్థులు ఇప్పటికే సిద్ధమైనందున పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగిస్తాం. ఆయా పరీక్ష కేంద్రాల్లో హై శానిటేషన్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. తల్లిదండ్రులు కూడా పరీక్షలు జరగాలనే కోరుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ బ్లీచింగ్‌ చేయడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సూచనలు పాటించాలి’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

‘ప్రజలకు నిత్యావసరాలు అందించే దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే అక్కడ జనసమ్మర్ధం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందున నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించాం. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా గుమిగూడవద్దు. మాకేం అవుతుందనే నిర్లక్ష్యం మంచిది కాదు. వ్యక్తిగత, గ్రామ, పట్టణ పారిశుద్ధ్యంతో పాటు రాష్ట్రాన్ని, పిల్లల్ని కాపాడుకుందాం. వైరస్‌ మనదేశంలో పుట్టింది కాదు. రాష్ట్రంలో నమోదైన కేసులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఐసోలేషన్‌లో ఉన్న వారంతా కోలుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు’ అని సీఎం వివరించారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 తర్వాత కల్యాణ మండపాలు మూసివేస్తాం. ఒకవేళ ముందే నిర్ణయమైన వివాహాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 200 మందికి మించకుండా పూర్తి చేసుకోవాలి. రాష్ట్రంలో అంత భయానక పరిస్థితులు లేవు. కాకపోతే అందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విదేశాల నుంచి వచ్చే విమానాలను ఈనెల 22 నుంచి కాకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. రేపు ప్రధాని మోడీతో జరిగే ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తా’ అని సీఎం అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu