ఇండస్ట్రీలో దర్శకుడిగా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోన్న దర్శకులను, అలానే ఒక సినిమా తీసి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ను ఎర వేసి మరీ పడుతోంది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ. రోజుకు కనీసం ఇద్దరుముగ్గురు కొత్త దర్శకులైనా.. కథలు పట్టుకొని గీతాఆర్ట్స్ లో ప్రత్యక్షమవుతున్నారని సమాచారం. దానికో కారణం ఉంది. ప్రస్తుతం మెగా హీరోల కోసం గీతా ఆర్ట్స్ కొత్త కథలు వింటోంది. కథ నచ్చితే మెగా హీరోలకు సెట్ అయినా.. కాకపోయినా.. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా.. సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. నిర్మాతగా ఎంతో అనుభవం సంపాదించిన అల్లు అరవింద్ చిత్రనిర్మాణాన్ని ఇక మరింత ముందుకు సాగించాలని అనుకుంటున్నారు.
అందుకే కొత్త కథలు విని వాటిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గీతాఆర్ట్స్ సంస్థ ఇప్పటికే పది కథలను లాక్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో.. చెప్పలేం కదా అందుకే కొత్త దర్శకులతో సినిమా చేయాలనుకుంటున్నామని ఈ నిర్మాణ సంస్థ చెబుతోంది. లఘు చిత్రాల ద్వారా ఆకట్టుకుంటోన్న నటీనటుల మీద కూడా ఈ సంస్థ దృష్టి పెడుతోంది. సినిమాల్లో ఎంటర్ అవ్వాలనుకునే టాలెంటెడ్ డైరెక్టర్స్ కు ఇది మంచి అవకాశమనే చెప్పాలి!