ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరామచంద్రుడి పాత్రలో బాలీవుడ్ గ్రీక్గాడ్ హృతిక్ రోషన్ నటించనున్నారట. ఈ మేరకు బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఓ గొప్ప చిత్రంలో నటించేందుకు హృతిక్ వెంటనే ఒప్పుకొన్నారని సమాచారం. మరోపక్క సీత పాత్రలో నయనతారను కానీ అనుష్కను కానీ ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి.
అయితే ఇవన్నీ ఎంత వరకు నిజం? అన్న విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రామాయణాన్ని త్రీడీ రూపంలో తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్ చేతులు కలిపారు. ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నారు. తొలిభాగం 2021లో విడుదల కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.