నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘సాహో’ సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతోంది.
సుజీత్ ఈ చిత్రం కథను తనకు నరేట్ చేసిన తర్వాత చాలా రోజుల వరకూ తనకు పిలుపురాలేదని నీల్ నితిన్ ముఖేష్ తాజాగా మీడియాతో అన్నారు. దీంతో సినిమా నుంచి తనను తీసేశారేమో అని భయపడ్డట్లు చెప్పారు. ‘ఓ అవార్డు ఫంక్షన్లో సుజీత్ను కలిశా. కొన్ని రోజుల తర్వాత ఆయన నన్ను కలిసి, ‘సాహో’ కథ నరేట్ చేశారు. నాకు పాత్ర నచ్చింది. ‘బాహుబలి’ సినిమా (2015) విడుదల కాకముందు జరిగిన సంఘటన ఇది. ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిన తర్వాత ప్రభాస్ కోసం మేమంతా రెండేళ్లు ఎదురుచూశాం. అప్పుడు ఆయన ‘బాహుబలి 2’ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ గ్యాప్లో నేను ఇతర సినిమాల్లో నటించా. ఆ సమయంలో ‘సాహో’ నుంచి నన్ను తీసేశారేమో అని భయపడ్డా. కానీ సుజీత్ తన మాట నిలబెట్టుకున్నారు (నవ్వుతూ)’.
‘సాహో’ సినిమా షూటింగ్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు జరిగింది. అదే సమయంలో నేను నా సొంత నిర్మాణ సంస్థలో ‘బైపాస్ రోడ్’ అనే సినిమాలో నటిస్తున్నా. ఆ సినిమా కోసం నేను బరువు తగ్గాలి. కానీ ‘సాహో’ లో నేను ఫిట్గా కనిపించాలి. ఈ నేపథ్యంలో కాస్త ఇబ్బందిపడ్డా. ‘బాహుబలి’ సక్సెస్ను పక్కనపెడితే.. ప్రభాస్ చాలా సౌమ్యంగా, వినయంగా ప్రవర్తిస్తుంటారు. అబుదబి షూటింగ్ జరుగుతున్నప్పుడు నా భార్య రుక్మిణి గర్భవతిగా ఉందని ఆయనకు తెలిసింది. ప్రభాస్ ఆమెను కలిసి చాలా బహుమతులు ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం’ అని నీల్ నితిన్ ముఖేష్ పేర్కొన్నారు.