HomeTelugu Reviews'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ

‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ

Sarkaru Vaari Paata movie r

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు.. నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ టైటిల్‌ ప్రకటించిన అప్పటినుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు​ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’ పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ : మహి అలియాస్‌ మహేశ్‌(మహేశ్‌ బాబు) ‘మహి ఫైనాన్స్‌ కార్పోరేషన్‌’ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గరు ఫైనాన్స్‌ తీసుకున్నవారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్దం చెప్పి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది కళావతి(కీర్తి సురేశ్‌). ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేశ్‌.. ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు.

Sarkaru Vaari Paata 1

కళావతి మాత్రం ఆ డబ్బుతో మద్యం తాగుతూ జూదం ఆడుతూ ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఒక రోజు మహేశ్‌కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తను అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, `మా నాన్న ఎవ‌రో తెలుసా? నీకు పైసా కూడా ఇవ్వ‌ను`అని మహేశ్‌ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌(సముద్రఖని) విఖాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బులు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేశ్‌. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్‌ ఇవ్వాల్సింది 10 వేల డాలర్లు కాదని, రూ. పదివేల కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల రూపాయాల కథేంటి? మహేశ్‌ బాబు గతం ఏంటి? చివరకు రూ.10వేల కోట్లను మహేశ్‌ ఎలా వసూలు చేశాడు అనేదే ‘సర్కారు వారి పాట’మిగతా కథ.

విశ్లేషణ : బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యదేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు..దానికి కమర్షియల్‌ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్‌ నిజాయితీగా ఉంటుంది. కానీ దాన్ని చూపించే పద్దతిలో లాజిక్‌ మిస్‌ అవుతుంది. కమర్షియల్‌ సినిమాలను లాజిక్‌ లేకుండా చూడాల్సిందే కాబట్టి.. ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు.

ఫస్టాఫ్‌ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిశోర్‌పై మహేశ్‌ వేసే పంచులు.. కళావతితో లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం 10వేల డాలర్ల కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా.. హీరో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్‌ టర్న్‌ తీసుకుంటుందని ప్రేక్షకుడు భావించే లోపు.. కళావతితో ‘కాలు వేసి నిద్రించే’ కామెడీ సీన్‌ పెట్టి జోష్‌ నింపాడు. మహేశ్‌ వేసే పంచ్‌ డైలాగులు, ప్రభాస్‌ శ్రీను కామెడీ, ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్‌ కూడా ముగుస్తుంది. అయితే ఫస్టాఫ్‌ మాదిరి కామెడీ సెకండాఫ్‌లో వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. సీరియస్‌ కథకి కామెడీ అతికినట్లుగా ఉంటుంది. బ్యాంకుల గురించి హీరో చెప్పే డైలాగ్స్‌ అందరికి ఆలోచింపజేస్తాయి. అయితే సెకండాఫ్‌ మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేట్లుగా కథనం సాగడం కాస్త మైనస్‌. మొత్తంగా లాజిక్‌ని పక్కకు పెట్టి సినిమా చూస్తే.. నచ్చుతుంది. మహేశ్‌ ఫ్యాన్స్‌ ని చిత్రం ఆకట్టుకుంటుంది.

Sarkaru Vaari Paata 2

నటీనటులు : అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఫైట్స్‌తో పాటు డ్యాన్స్‌ కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్‌ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు.తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఆకతాయి అమ్మాయి కళావతిగా కీర్తి సురేశ్‌ మెప్పించింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఇక మహేశ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రాజేంద్రనాథ్‌ పాత్రకు ప్రాణం పోశాడు ఆయన. వెన్నెల కిశోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. కళావతి, మ..మ..మహేశా పాటలు అయితే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ని ఉర్రూతలు ఊగిస్తాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్‌ పర్వాలేదు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

టైటిల్‌ : ‘సర్కారు వారి పాట
నటీనటులు : మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, సముద్రఖని,వెన్నెల కిశోర్‌ తదితరులు
దర్శకత్వం:  పరశురాం
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం : తమన్‌

హైలైట్స్‌‌: మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ నటన
డ్రాబ్యాక్స్‌: కొన్ని సన్నివేశాలు

చివరిగా: ‘సర్కారు వారి పాట’… మహేష్‌ ఫ్యాన్స్‌కి పండగే..
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu