కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ వైరస్ కట్టడి కోసం సెలబ్రెటీలు తమవంతు సాయం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ కార్మికులకి, పేదలకి ఆసరాగా నిలుస్తున్నారు. దానిలో భాగంగా.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రతిరోజూ 45 వేలమందికి ఆహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి అంధేరి, జోగేశ్వరి, జుహూ, బాంద్రా ప్రాంతాల్లో ప్రతిరోజూ 45 వేల మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇప్పటికే సోనూసూద్.. కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న డాక్టర్ల కోసం తన హోటల్లో వసతి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు రోజూ తిండి దొరకడంలేదు.. అలాంటివారికి సాయం చేసేందుకు నేను ‘శక్తి అన్నదానం’ అనే కార్యక్రమాన్ని చేపట్టాను. దీని ద్వారా మరింత మందికి సాయం చేయాలని భావిస్తున్నాను.’అని సోనూసూద్ తెలిపారు. సేవాగుణాన్ని చాటుతున్న సోనూసూద్ అందరు మెచ్చుకుంటున్నారు. రీయల్ హీరో అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.